ఆవేశం ఆవేదన ఆక్రోశం  

Posted by దైవానిక

ఏమిటీ దారుణం?? ఎందుకీ మారణహోమం?? ఏం చేస్తుందీ ప్రభుత్వం??
ఏమీ చేయలేని నిస్సహాయత ఎందుకు??
బ్రతుకు భీభత్సం చేయడమే లక్ష్యమా??
తీవ్రవాద చరిత్రలోనే అతి దారుణమయిన సంఘటన జరిగిన రోజుగా, ఈ రోజు చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. తీవ్రవాదములోనే ఒక వినూత్న పద్దతిని ప్రవేశపెట్టి, జనాన్నిభయ భ్రాంతులకి గురి చేసే సంఘటన. పోలీసు జీపులోనుంచి యథేచ్ఛగా కాల్పులు జరిపిన తీవ్రవాదం. హాస్పిటల్ల మీద బాంబులు విసరడం. ఇవన్నీ తలుచుకుంటేనే వెన్నుపూసలోంచి సన్నగా భయం పుట్టుకొచ్చి ఒళ్ళంతా వణుకుతుంది. ఏ పని మీద దృష్టి పెట్టలేకపోవడం, ఏది చేసినా ఈ దారుణమే గుర్తురావడం, మనస్సు పడే అవేదన ఎవరికి చెప్పను. చెప్పడానికి మాటలు కూడా రావట్లేదే??
అయ్యో భగవంతుడా, ఏమిటయ్యా నీ లీలలు.. ఇంతా జరుగుతుంటే ఎక్కడున్నావయ్యా?? పూర్వ జన్మ పాపం అని సరిపెట్టుకుందామంటే మనస్సొప్పుకోవట్లేదేమయ్యా??

కరాచీ నుంచి బోటులో తీవ్రవాదులు రావటం ఏమి విచిత్రం?? అంత సులువుగా బోటులో ఆయుధాలేసుకొనెచ్చేసారే, ఇక ఈ దేశంలో భద్రత ఎక్కడుంది. ఇదేదో గోలకృష్ణ సినిమాలలోనే జరుగుతుందనుకున్నాను కాని, నిజంగా జరగుతుందని కలలో కూడా అనుకోలేదే.

ఏ చానల్ చూసినా ఈ కుల మత విచక్షణ చేసి మృతులను విడదీయడేమిటీ. అందరూ ఐక్యంగా ఉండాల్సిన సమయంలో ఏమి ఈ లెక్కలు స్వామీ?? మానవత్వం అని ఒకటుందనే మర్చిపోయినట్టున్నారే??
ఒక పక్క ఆర్థిక సంక్షోబంలో దేశం, ప్రపంచం కొట్టి మిట్టాడుతుంటే మధ్యలో తీవ్రవాదం నేనూ ఉన్నానని పలకరిస్తోందా ఏమిటీ??
హయ్యో ఏమి ఈ బాధ, తట్టుకోలేకున్నానే. ఇలా భయపెట్టడమే తీవ్రవాదులు లక్ష్యమైతే వారి కోరిక నెరవేరినట్టే. ఎంతో దూరాన ఉన్న నాకే ఇంత భయం వేస్తుంటే, అక్కడ ఉన్న జనం ఇంకెంత భయపడుతున్నారో.

ఏంటో మొదలెట్టి, ఏదో చెప్పి , ఎలా ముగిస్తున్నానో నాకే అర్థం అవ్వట్లేదు.
ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలకు కొరత లేకుండా చూడాలని ఆ పరమాత్మకి దణ్ణం పెట్టుకోవడం తప్ప నేనేమి చెయ్యగలను. ఈ నిస్సహాయతని చూస్తే నా మీద నాకే అసహ్యం వేస్తోంది.

ప్యాలేస్ గ్రౌండ్స్ లో పుస్తకాల వేట  

Posted by దైవానిక

పోయిన వారం బెంగుళూరు పుస్తకాల పండగ(bangalore book festival) ప్యాలేస్ గ్రౌండ్స్ లో జరగనున్నాయని, అన్ని భాషా పుస్తకాలు లభిస్తాయని వార్తపత్రికలో చదివి తప్పకుండా వారంతం వెళ్ళాలని నిర్ణయించేసాను. బెంగుళూరులో తెలుగు పుస్తకాలు దొరకడమే మహాభాగ్యం. వెంటనే పూర్తిగా ఈ సౌకర్యం వినయొగించుకోవాలని అనుకున్నాను, కాని ప్యాలేస్ గ్రౌండ్స్ లో అంటేనే గుండె గుటుక్కుమంది. మొన్ననే అక్కడ రెండు రోజులు ట్రాఫిక్కు జాం అయ్యి సుమారు 5 గంటలు జనాలు ఇరుక్కుపోయారు. కాని పుస్తకాల కోసం అందునా తెలుగు పుస్తకాల కోసం ఎంతటి ప్రయాసనయినా అనుభవించాలనే డిసైడ్ అయ్యాను. అసలే కొనాల్సిన పుస్తకాల లిస్టు బాగానే ఉంది. మా ఓరుగల్లు విశాలాంధ్రలో, ఏ పుస్తకం అడిగినా లేదండి అని ఒకే సమాధానం చెప్తున్నారు. కనుక ఎటువంటి అవాంతరాలొచ్చినా వెళ్ళి తీరాల్సిందేనని తీర్మానించటం జరిగింది. తోడు ఎవరన్నా వస్తారేమోనని ఆలోచించా, బుక్ ఫెస్టివల్ కొచ్చెవాళ్ళు ఎవరూ ఊళ్ళో లేకపోవడం వల్ల ఒక్కడినే బయలుదేరాల్సొచ్చింది. బెంట్రామ ( బెంట్రామ: బెంగుళూరు ట్రాఫిక్కు మథనం, ఇది కావించిన ఇహంలోనే నరకప్రాప్తి లభించును) గావించుటకు మిట్ట మధ్యాహ్నం బయలు దేరా, మిట్ట మధ్యాహ్నం అయితే ట్రాఫిక్కు ఎక్కువ ఉండదులే అని. కాని నేనొక వెర్రిమాలోకాన్ని అని మొదటి జంక్షన్ చేరగానే తెలిసింది. బెంగుళూరులో జనం వారాంతం అనగానే మిట్ట మధ్యాహ్నం దాకా నిద్దరోయి, సూర్యుడు నడి నెత్తికి వచ్చినప్పుడే బయటకి వస్తారన్నమాట. ఎలాగోలాగ, తలలో పేను దూసుకెళ్ళినట్టు దూసుకెళ్ళి ఒక గంటలో చేరుకున్నాను. బుక్ ఫెస్టివల్ అంటే ఖాళీగా విలవిలలాడుతుందనుకున్నాను కాని జనం యిరగున్నారు. మొదట కాస్త ఆశ్చర్య పడినా తరువాత ఆనందపడ్డాను. ఎంట్రీ టికెట్టు, అదీ ఇరవయ్యి రూపాయలనే సరికి, జనాలు డబ్బు కట్టి మరీ ఇంత మందొచ్చారని ఇంకాస్త సంతోషపడ్డాను. ఇక దాడి ఆరంభించాను. ఒక 5,6 షాపులు దాటగానే తెలుగు పుస్తకాల షాపుంది. అబ్బ అని అటాక్ చేసా. నేను కొందామనుకుంటున్న చాలా పుస్తకాలు కనపడ్డాయి. వాటి వివరాలు ఇక్కడ.
1. భారతంలో చిన్ని కథలు , రచయిత: ప్రయాగ రామకృష్ణ , పబ్లిషర్: ధరణి ప్రింటర్స్ , వెల: 150
ఈ బుక్ కోసం చాలారోజులుగా వెతుకుతున్నాను. స్నేహితుడొకడు చెప్పగా విని కొనాలని చాలా రోజులుగా ప్రయత్నించాను. వరంగల్లు లోని విశాలాంధ్ర వారు తెప్పిస్తానని చాలా రోజులుగా దాటేస్తున్నారు. కాని పుస్తకం చదివాక (చదివినంతవరకు) చాలా కథలు తెలిసినవే ఉండడం నన్ను కాస్త నిరుత్సాహ పరచింది. ఇంకా చాలా కథలే ఉన్నాయి. పూర్తిగా చదివితే గాని చెప్పలేను. రచయిత "వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ" అని రేడియేలో వినపడే ఆయినేనా అన్న అనుమానం తీరలేదు.

2. శతక రత్నాకరము - గుంటూరు వీరరాఘవశాస్త్రి - బాలసరస్వతి బుక్ డిపో - 150 -
అలా పుస్తకాలు చూస్తుంటే ఇది తగిలింది. ఈ మధ్య నా పద్య పైత్యం గురించి ముందే చెప్పాను కదా.. చూసిన వెంటనే కొనేసాను. దీనిలో చాలా శతకాలున్నయి. కొన్నిటి పేర్లు కూడా వినలేదు, ఉదా:- కీరవాణి శతకము, జనార్థన శతకము, కుమారీ శతకము. దాదాపుగా ౩౩ శతకాలున్నాయి. ఇన్ని ఒకచోట దొరకడం అదృష్టమే. కాని వాటికి తాత్పర్యాలు లేవు. నా తెలుగు మీద నాకంత నమ్మకమా!! అని ఇప్పుడు కాస్త ఆలోచిస్తున్నాను. అయినా పదాలకి అర్థాలు తెలియకపోతే బ్రౌణ్యముండనే ఉంది, ఇంకా అర్థం కాకపోతే బ్లాగుల్లో చాలామందున్నారన్న నమ్మకం.

3. రంగనాయకమ్మ నవలలు: పబ్లిషర్: స్వీట్ హోంపబ్లికేషన్స్
చదువుకున్న కమల - 15
ఇదే నా న్యాయం - 50
బలిపీఠం - 60
జానకి విముక్తి - 125
రంగనాయకమ్మ గారి నవలలు చదవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. మన సుజాత గారి మాటలు విన్నాక, మొన్నా మధ్యన జరిగిన చర్చ చూసాక ఆవిడ పుస్తకాలు కొనాలనే నిర్ణయం బల పడింది. కాని ఏమి కొనాలో తెలీలేదు. విషవృక్షం కోందామంటే, సైజు చూసి కొంచెం దడుచుకున్నాను. మొదట వేరేవి చదివి ఆ తరువాత అది చదువుదాములే అని ఆ నాలుగు కొన్నాను. ఎలా ఉంటాయో ఏమిటో??

4.పెద్దబాలశిక్ష - పోతూరిసీతారామాంజనేయులు- టాగూరు పబిషింగ్ హౌస్ - 27
వెనకట పెద్దబాలశిక్షలేని ఇల్లు ఉండేది కాదట. ఇంతకు ముందు నా రూమ్మేట్ దగ్గర ఉండేది. అసలు అందులో లేనిది లేదంటే ఆశ్చ్రర్యపోనక్కరలేదు. అది చూసి చాలా నచ్చేసింది. వాస్తు గురించి, సామెతలు, కవుల గురించి, తిథులు, ఒక్కటేమిటి లేనిదుండదు. చాలారోజులుగా కొనాలనుకుంటున్న మరో పుస్తకం ఇది. ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది. మన ఇంట్లో తప్పకుండా ఉండవలసిన పుస్తకం.

5. అమరావతి కథలు - సత్యం శంకరమంచి - నవోదయా పబ్లిషర్స్ - 175
అమరావతి కథలు గురించి తెలియనిదెవ్వరికి చెప్పండి. మా చిన్నప్పుడు దూరదర్శన్ లో అమరావతీ కి కథాయే అని హిందిలో వచ్చేవి. భళేగా ఉండేవి. చాలా మంది తెలుగు నాయికానాయకులుండడంతో ఇంకా ఆసక్తిగా చూసేవాణ్ణి. అశోక్ కుమార్ చాలా వాటిల్లో ఉండేవాడు. ఇవి టీవిలో చూడడమే కాని చదివిన పాపాన పోలేదు. బుక్ అక్కడ కనపడిన వెంటనే ఠక్కున పట్టుకున్నాను. చదవాలి .. బాగుంటాయని గట్టి నమ్మకం.

6. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు - విశాలాంధ్ర - 100
అక్కడ పుస్తకాలమ్మే అతని గట్టి రికమండేషన్, తప్పకుండా చదవి తీరాలన్నాడు. ఇంతకు మించి నాకు రచయిత గురించి గాని కథల గురించి కాని ఏమి తెలియదు. బాగుంటాయనే అనుకుంటున్నాను

7. నవ్వితే నవరత్నాలు 1&2 - మల్లిక్ - ఎమెస్కో బుక్స్ - 50
మల్లిక్ అంటే హాస్యానికి పెట్టింది పేరు. అందుకని కొన్నాను. అందుకే కాదులే, ఎందుకో మల్లిక్ అంటే కాస్త అభిమానం. బాగుంటాయని నమ్మకం కూడా.

8. అంపశయ్య - నవీన్ - ప్రత్యూష ప్రచరణలు - 120
నవీన్ గురించి చాలా విన్నాను. అతని చైతన్యస్రవంతి గురించి కూడా. అంపశయ్య గురించి కూడా. 60 లలో విధ్యార్థుల గురించి, వాళ్ళ విప్లవాల, ఆలోచనల గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఈ పుస్తకం కొనడం జరిగింది.

9. టాగోర్ గీతాంజలి - చలం - అరుణా పబ్లిషింగ్ హౌస్ - 30
ఈ పుస్తకం చూడగానే చలం గీతాంజలిని అనువదించాడా, అయితే తప్పక చదవాలని తీసుకున్నాను. చలం ఇంటర్ప్రెటేషన్ చదవాలని కొన్నాను.

10. బుడుగు - ముళ్ళపూడి వెంకటరమణ - విశాలాంధ్ర - 90
బుడుగు గురించి గాని రమణ గారి గురించి కాని ఇంట్రడొక్షన్ ఇవ్వడం దుస్సాహసమే అవుతుంది.

ఇదండీ నా పుస్తకాల వేట. అన్ని పుస్తకాల మీద 10% రాయితీ వచ్చింది. నేను విశాలాంధ్ర మెంబర్ ని అవ్వడం వలన వాళ్ళ పబ్లికేషన్స్ మీద 20% రాయితీ లభించింది. ఇన్ని పుస్తకాలకి కేవలం ఒక సహస్రం మాత్రమే అవ్వడం అమితానందాన్నిచ్చింది. నేను హ్యారీపోటర్ ఒక్క పుస్తకం 975 పెట్టి కొన్నాను. ఇప్పుడు దాదాపుగా అదే ధరకి నాకు 14 పుస్తకాలొచ్చాయి. (మాలతి గారు వింటున్నారో లేదో, మేమూ పుస్తకాలు కొంటున్నాం). మళ్ళి సంవత్స్రరం తప్పకుండా వస్తానని షాపతినికి చెప్పి 5 కిలోల పుస్తాకలు పట్టుకొచ్చాను(కిలోలంటున్నాని ఆశ్చర్యపోకండి. బెంగుళూరులో అన్ని కిలోల లెఖ్ఖే..కిలో నారింజ పళ్ళు, కిలో సొరకాయి, కిలో పుస్తకాలు. ఈ పుస్తకాలన్ని బాగా చదివాలని, ఎవ్వరు అప్పివ్వమని అడగకూడదని, ఒకవేళ వాళ్ళడిగినా నేనివ్వకూడదని, ఒకవేళ నేనిచ్చినా వాళ్ళి తిరిగిచ్చేయాలని అప్పుడే దేవిడికి దణ్ణం కూడా పెట్టేసాను. అయినా నా అమాయకత్వం కాని ఇవన్ని మనచేతుల్లోనే ఉన్నాయని గ్రహించలేకపోయాను. కొన్నానని ఎవరికైనా చెప్తే కాదా హి హి హి

అత్తగారు - చురకలు  

Posted by దైవానిక

మా అత్తగారు మాంచి హాస్య చతురులు. ఎప్పుడు అందరితో నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. కాని ఎప్పుడయినా కాస్త కోపం వస్తే చురకలు భళే వేస్తారు. నాకీ అనుభవం పెళ్ళైన కొత్తలోనే వచ్చింది. ఇప్పటికి ఆ సంగతి గుర్తొచ్చినప్పుడు తెగ నవ్వొస్తుంది. నా పెళ్ళైన కొత్తలో మా అత్తగారి తరుపు బంధువు ఒక ముసలావిడ రోజు మా ఇంటికి వస్తుండేది. ఆ మాట ఈ మాట చెప్పి సుబ్బరంగా ఇంట్లో చేసినవన్ని లాగిస్తూ ఉండేది. మా అత్తగారు పెద్దగా పట్టిచ్చుకునేవారు కాదు. పాపం పెద్దావిడ, కాస్త తిండి యావ ఎక్కువనుకుంటా అనేవారు. ఇంకొన్నాళ్ళకి వంటింట్లోకి దూరి అన్నిటిని వెతికి తినడం ప్రారంభించింది.ఆచారవంతురాలైన మా అత్తగారు, మామూలుగా వంటింట్లో తన మడి వంట సామాన్ని ఎవర్ని ముట్టనివ్వరు. పనివాళ్ళు ఎవరయినా ముట్టుకుంటే ఆ రోజు యుధ్ధమే. ఈ ముసలావిడ అవన్ని ముట్టేసుకొని అంతా కెలికి వదిలేసింది. మా అత్తగారికి చిర్రెత్తుకొచ్చింది. కనుబొమ్మలు రెండు కలసిపోయాయా అన్నంత దగ్గరకొచ్చాయి. నాకు భలే భయం వేసింది. కాని మా అత్తగారు ఏమి అనకుండా ఊరుకున్నారు. హమ్మయ్య అంతా శాంతించింది కదా అనుకున్నాను. ఆ ముసలమ్మ అంతా వెతికి వచ్చి కూర్చుంది. మా అత్తగారు ఏమి మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారు.
"అమ్మణ్ణీ, ఇదవరికి మధ్యాహ్నాలు ఏము తోచేది కాదే, ఈ మధ్య మీ ఇంటికొస్తున్నానా, బాగా పొద్దుపోతోంది" అందా ముసలావిడ. మా అత్తగారు చురుక్కున ఒక్క చూపు చూసి
"తోచి తోచనమ్మ తోడికోడలు పుట్టింటికెళ్ళిందట" అని అన్నారు. అంతే ఆ ముసలావిడ మళ్ళా మా ఇంటివైపు చూస్తే ఒట్టు. అప్పుడు కాస్త మనస్సు చిముక్కుమన్నా తర్వాత మా అత్తగారి చతురతని, ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.
తరువాత మా అత్తగారి అక్క మనవరాలి పెళ్ళికి వెళ్ళాము. అక్కడ ఒక పెద్ద యుధ్ధమే జరిగింది. ఎవరో ఒకావిడ కొడుకుని ఇంకికావిడ ఏదో అందిట, అంతే ఆ ముందావిడ, అన్నావిడ వంశం మొత్తాన్ని ఏకి పారేసింది. మూడూర్లకి వినిపించేంత గట్టిగా అరిచి, ఆపడానికొచ్చిన అమ్మలక్కలందరినీ నాలుగు తిట్టి పెట్టే బేడా సర్థుకోని వెళ్ళిపోయింది. మా అత్తగారు అసలే తగువులకి దూరంగా ఉంటారు. అంతా ఒక మూలనుంచి చూసి వదిలేశారు. ఆ తిట్లు పడ్డావిడ కూడా బాగా గుణిగి, తన పరిథిలో తిట్టి బయలుదేరి వెళ్ళింది. ఆ తరువాత మా అత్తగారి అక్క కోడలు వచ్చింది. ఆవిడకి తగువులంటే బహు సరదా అనుకుంటా.. ప్రతి ఒక్కళ్ళ దగ్గరకి వెళ్ళి జరిగిన తగువు గురుంచి తెలుసుకోని, తన గురించి కాస్త డప్పుచెప్తుంది. తను ఏవిధంగా మహా శాంతమూర్తో, అసలు తనకి తగువంటే ఏంటో కూడా తెలియదన్నట్టు మాటలు చెప్పసాగింది. మా అత్తగారు ఇవన్ని ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. అసలే ఆవిడంటే మా అత్తగారికి అరికాలి మంట నెత్తికెక్కుతుంది. ఇంతలో ఆవిడ మా అత్తగారి దగ్గరికి కూడా వచ్చింది.
"అవునత్తమ్మా , ఆ పేరందేవి సుబ్బమ్మని నానా తిట్లు తిట్టిందటగా??"
"ఊ"
"అంతా నీముందే! వెళ్ళి ఆపలేకపోయావా!! నేనయితే ఎలాగోలాగ ఆపేదాన్ని, సమయానికి మా ఇంటికెళ్ళాల్సొచ్చింది"
"ఆపినా ఆగే రకమేనా అది??" అన్నారు మా అత్తగారు.
"ఏమోనమ్మా, అసలు నాకు ఈ తగువులంటేనే పడవు. నేనసలు ఎవరి జోలికి పోను. అదికాదత్తా, అసలు ఈళ్ళకి ఈ తగువులెందుకొస్తాయంటావు??" మా అత్తగారి కనుబొమ్మలు మళ్ళా కలిసిపొతాయేమో అన్నట్టుగా తయారయ్యాయి. వెంటనే చురక పడబోతుందనుకుంటూనే ఉన్నా, "జగడమెందుకొచ్చిద్దిరా జంగందేవరా అంటే, బిచ్చమెయ్యవే బొచ్చుముండా అన్నాడంట" అన్నారు మా అత్తగారు. చుట్టుపక్కల అమ్మలక్కలంతా పగలబడి నవ్వారు. కొందరు దీని తిక్క కుదిరిందనుకున్నారు. ఆవిడ ఠక్కున లేచి చురచుర చూసి కోపంతో రుసరూలాడుతూ వెళ్ళింది.

ఇంతలో పెళ్ళి తంతూ అంతా అయ్యింది. ఇంకా ఎవరికి చురకలు పడలేదనే చెప్పాలి. మా అత్తగారి దగ్గర అందరూ కాస్త జాగ్రత్తగా మసులుతున్నారు. ఎందుకొచ్చిన చురకలో అని అనికొనుంటారు. ఇంతలో పెళ్ళి కూతుర్ని గడప దాటించే సమయం రానే వచ్చింది. పెళ్ళి కూతురుది కాస్త భారీ శాల్తీ. ముగ్గరమ్మలక్కలు గట్టిగా తోసినా అంగుళం కూడా కదలట్లేదు. అమ్మలక్కలంతా గదిలోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అమ్మయేమో కొంచెం కూడా కదలట్లేదు. కదలక పోగా, "ఉహూ, నాకు సిగ్గు, నేను వెళ్ళను" అంటూ మెలికలు తిరిగి పోతుంది. మా అత్తగారు వెనకనుంచి అంతా చూస్తూనే ఉన్నారు. ఇలా తతంగం అంతా ఒక పావుగంట నడిచింది. పెళ్ళి కూతురు మాత్రం కొంచెం కూడా కదల్లేదు. మా అత్తగారికి ఒళ్ళు మండినట్టుంది. కనుబొమ్మలు కలుస్తున్నాయి.
" వెనకటికి నీలాంటిది ఇంట్లో మొగుడున్నాడని తెగ సిగ్గుపడి, వీధిలో బట్టలు మార్చుకుందట" అని బిగ్గరగా అంది. వెంటనే అందరు పడిపడి నవ్వారు. పెళ్ళికూతురు తలవంచుకొని మెళ్ళగా లోపలెకెళ్ళి గడిపెట్టింది. మా అత్తగారి సమయస్పూర్తికి, హాస్య చతురతుకు అందరు నాలుగు పొగడ్తలు ఝుళిపించారు.
(సమాప్తం)

ఈ కథని నేను భానుమతి గారి అత్తగారు కథలు చదివి ఇన్స్పైర్ అయ్యి వ్రాసింది. మీకు కథ నచ్చితే ఆ గొప్పంతా, ఆ పాత్ర సృష్టించిన భానుమత్తి గారిదే. నచ్చకపోతే ...